అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం ఉదయం 11.40 గంటలకు చేరుకున్నారు. అమెరికా సైనిక విమానం ఎయిర్ఫోర్స్ వన్లో భార్య మెలనియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుర్దిష్ సహా ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంతో కలిసి చేరుకున్న ట్రంప్నకు ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పలువురు కేంద్ర మంత్రుల ఘనస్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో కళాకారులు స్వాగతం పలకగా, ట్రంప్ తన వాహనం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి మోదీతో కలిసి శబర్మతి ఆశ్రమానికి ట్రంప్ బయలుదేరారు. మధ్యాహ్నం 12.15లకు శబర్మతి ఆశ్రమానికి చేరుకుని, అక్కడ నుంచి గాంధీనగర్లో నిర్మించిన మొతేరా స్టేడియాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు. ఇక ట్రంప్ టూర్ కోసం గుజరాత్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది. ట్రంప్ కు స్వాగతం పలకడం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు చేస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మిలానియా ట్రంప్తో కలిసి వచ్చారు. అయితే ఆయన టూర్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మొదలవుతోంది. ట్రంప్ను స్వాగతించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు కనిపించకూడదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖర్చు విషయంలో వెనకాడవద్దని కూడా సీఏం సూచించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి కావాలని ప్రభుత్వం అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశ అధ్యక్షుడు తమ రాష్ట్రానికి వస్తుండడంతో అహ్మదాబాద్ నగరం నవ వధువులా ముస్తాబవుతోంది. ట్రంప్ వెళ్లే మార్గంలో రోడ్లు అద్దంలా కనిపించేందుకు అహ్మదాబాద్ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏయూడీఏ) సంయుక్తంగా రహదారులు మరమత్తులు, నగరంలో సుందరీకరణ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మోతేరా స్టేడియం ప్రారంభించిన తరువాత ట్రంప్ తిరిగి విమానాశ్రయానికి వెళ్లే మార్గంలోని 17 రహదారులు, కొత్తగా ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు వేయడానికి రూ .60 కోట్లు ఖర్చవుతోంది. అలాగే రోడ్షో మార్గంలో సుందరీకరణకు రూ.6 కోట్లు, రోడ్ల కోసం రూ.20 కోట్లను ఏయూడీఏ వెచ్చిస్తోంది. పేదరికం ఆనవాళ్లు కనపడకుండా జాగ్రత్త పడుతోంది. స్లమ్ ఏరియాలో నివసించే పేదల గుడిసెలు కనిపించకుండా అడ్డంగా ఓ గోడను నిర్మిస్తోంది. ట్రంప్ వెళ్ళాక, ఖర్చు అయినా మొత్తాన్ని లెక్కపెట్టనున్నారు.
గుజరాత్ టూర్లో భాగంగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 24న 22 కిలోమీటర్ల మేర కొనసాగే రోడ్ షోలో పాల్గొంటారు. 50 వేలకు పైగా బీజేపీ కార్యకర్తలు వీరికి స్వాగతం పలకనున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమానికి వెళతారు. అక్కడి నుంచి మోతెరాలోని నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంకు చేరుకుంటారు. రోడ్ షో మార్గాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. డివైడర్లకు రంగులు వేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పూలతో అలంకరిస్తున్నారు. ఇందుకోసం 6 కోట్లు ఖర్చవుతోంది. రోడ్ షో సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను 4 కోట్లు కేటాయించారు. ట్రంప్ భద్రతా ఏర్పాట్ల కోసం గుజరాత్ ప్రభుత్వం 15 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. మోతేరా స్టేడియంలో నిర్వహిస్తున్న ‘కేమ్ ఛో ట్రంప్’ కార్యక్రమానికి సుమారు లక్షమంది హాజరవుతారని అంచనా. వీరి ట్రాన్స్పోర్ట్ అల్పాహారం కోసం సుమారు 10 కోట్లు ఖర్చవుతుంది. ట్రంప్ పర్యటన కోసం గుజరాత్ ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తోంది. దీనిలో కొంత కేంద్రం భరించనుంది. మెజారిటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచే ఖర్చవుతోంది. ట్రంప్ పర్యటనకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తిచేయాలని, నిధుల కారణంగా ఎలాంటి జాప్యం జరగరాదని అన్ని విభాగాలకూ ప్రభుత్వ అనుమతులు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్ నగరంలోని రహదారుల మరమత్తుల కోసం ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినట్టు ఏఎంసీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మోతేరా స్టేడియం, సబర్మతి ఆశ్రమయం, విమానాశ్రయం మార్గాల్లో రహదారుల కోసం నిధులు మంజూరుచేసినట్టు తెలిపారు.