ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెట్టిస్తుంది. కరోనా దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. అందులో భారత్ కూడా ఉంది. భారత్ లో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉండనుంది. అయితే ముందుగా ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 14కు లాక్డౌన్ ముగుస్తుందా? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మనకంటే ముందే స్టే ఎట్ హోమ్ను ప్రకటించిన దేశాలు ఇంకా లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. అక్కడ కేసుల తీవ్రత దృష్ట్యా లాక్డౌన్ తప్పడం లేదు. ఇక మన దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,072కు చేరింది. మరణాలు కూడా 77కు చేరింది. వేలాది మంది ఇంకా క్వారంటైన్లోనే ఉన్నారు. రోజుకు వందల మందికి కరోనా పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను ఇంకా కొనసాగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగుతోంది.

అయితే లాక్డౌన్ను కొనసాగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు అధికారులు. 14తో లాక్డౌన్ ముగుస్తుందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై స్పష్టత ఇవ్వకపోయినా సంకేతాలు మాత్రం ఇచ్చారు. రాష్ట్రాలు కూడా అందుకు సంసిద్ధమవుతున్నాయి. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు అదుపు తప్పితే మళ్లీ నిర్ణయం తీసుకుంటారని, ప్రస్తుతానికైతే కొనసాగించే అవకాశాలు లేవంటున్నారు అధికారులు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ తర్వాత కూడా కొన్ని షరతులు విధించే అవకాశం ఉందని కొందరి మాట. షాపింగ్ మాల్స్, థియేటర్స్ లాంటి ప్రదేశాల్లో జనాలు ఎక్కువగా గుమిగూడతారు. అందువల్ల కరోనాను అరికట్టడం కష్టమవుతుంది. దాని వల్ల ఆయా రాష్ట్రాలలోని పరిస్థితులు బట్టి ఆంక్షలు ఉండేలా ప్రభుత్వాలు సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత కొన్ని ఆంక్షలు విదించే అవకాశాలు ఉన్నాయి.. ఆ ఆంక్షల విషయానికి వస్తే..
- రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులపై ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అటు ముఖ్యమైన సర్వీసులు మాత్రం అనుమతిస్తారని అంటున్నారు. అటు జనరల్ బోగీలను కూడా ప్రస్తుతం క్లోజ్ చేసే పరిస్థితి ఉంది.
- లాక్ డౌన్ తర్వాత బస్సు సర్వీసులను కూడా దశలవారీగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులతో పాటు దుకాణ సముదాయాలపై ఆంక్షలు సడలించే అవకాశం ఉంది. అయితే షాపింగ్ మాల్స్, వాణిజ్య దుకాణాలను మాత్రం నిర్దిష్ట సమయం వరకే తెరిచే ఉండేలా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.
- లాక్ డౌన్ తర్వాత దేశీయ విమానాలు ప్రారంభించినా.. అంతర్జాతీయ సర్వీసులపై మాత్రం ఆంక్షలు ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
- 10 సంవత్సరాలలోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడిన వయస్సు వారిని బయట తిరగనీయకుండా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
- అటు థియేటర్లు, బార్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చే వాణిజ్య సదుపాయాలపై అంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.