ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్తో సమావేశమై రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముకేష్ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ.. రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ కూడా ఉన్నారు. అంతకముందు ఎయిర్పోర్ట్లో అంబానీకి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంబానీకి ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఏపీలో పెట్టుబడులపై జగన్ అంబానీతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలతో పాటూ.. రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసే ప్రాజెక్టులపై ప్రముఖంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంబానీ తొలిసారి కలిశారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ మీటింగ్ పై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ క్రింది వీడియో చూడండి
జగన్మోహన్రెడ్డి, ముఖేష్ అంబానీల మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. తనను కలవడానికి వచ్చిన అంబానీకి సీఎం జగన్ ఏ బహుమతి ఇచ్చారని వర్ల రామయ్య ప్రశ్నించారు. లేకుంటే సీఎంకు అంబానీ ఏమి ఇచ్చారని ప్రశ్నించారు. మీ ఇద్దరి మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఏంటని నిలదీశారు. ఈ మేరకు ఆదివారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య వెనుక రిలయన్స్ హస్తముందనే అభియోగాలతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ కు చెందిన సంస్థలపై దాడులు జరిగాయని వర్ల రామయ్య గుర్తు చేశారు. ఆ విధ్వంసం వెనుక వైఎస్ జగన్ ఉన్నారని ఆరోపించారు.

జగన్ పిలుపునందుకుని ఆనాడు రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికీ అనేక మంది జైళ్లలో మగ్గుతున్నారని వ్యాఖ్యానించారు. వారిలో అధికంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. అలాంటిది ఇప్పుడు అంబానీకి అంతటి సాదర స్వాగతం ఎలా పలుకుతారని సీఎం జగన్ను వర్ల రామయ్య ప్రశ్నించారు.

సీఎం జగన్, అంబానీ మధ్య జరిగిన ఒప్పందం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వారిద్దరి మధ్య ఎలాంటి సయోధ్య కుదిరిందని ప్రశ్నించారు. త్వరలో రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీని తిరిగి పార్లమెంటుకు పంపేందుకే ఈ భేటీ జరిగిందా అని ప్రశ్నించారు. నత్వానీ అనే రాజ్యసభ సభ్యుడిని తీసుకుని అంబానీ మీ దగ్గరకు వస్తే ఏమనుకోవాలని నిలదీశారు. అంబానీకి ఏ బహుమతి ఇచ్చి పంపారు ముఖ్యమంత్రి గారూ అని ప్రశ్నించారు. ఇకపై నీతులు మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని, హైకోర్టు చివాట్లు పెట్టినా జగన్ వైఖరి మారలేదని మండిపడ్డారు.
ఈ క్రింది వీడియో చూడండి