ఏపీలో వినూత్న పథకాలతో మందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నవరత్నాలతో పాటూ కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాలకు చేయూతనిస్తున్నారు. తాజాగా పేద బ్రాహ్మణుల కోసం మరో పథకాన్ని తీసుకొచ్చారు.
ఇకపై ఏడేళ్ల నుంచి పదహారేళ్ల మధ్య వయస్సున్న పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని పిల్లలకు ఉపనయనం అంటే వారు జరిపే (ఒడుగు) ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ సర్కార్ . ఈ స్కీమ్ కింద రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు.. ఇలాంటి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకోంటోంది జగన్ సర్కార్. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా దీనిని అమలు చేయనున్నారు.
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్లతో పలు స్కీంలు అమలవుతున్నాయని.. 15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర స్కీంల కింద ఇప్పటి వరకు 22,056 మంది లబ్ధిదారులను గుర్తించామని.. త్వరలో వారందరికీ ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
అంతేకాదు.. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బ్రాహ్మణ యువతకు “భారతి” స్కీం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుందని.. దీనికి సంబంధించిన దరఖాస్తులను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
అయితే ఏడాదికి రూ.6 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. అంతేకాదు.. ఈ స్కీంలో ఒక విడత ఆర్థిక సహాయం పొందిన వారికి మరోసారి ఆర్థిక సహాయాన్ని అందివ్వరు. కనీసం ఏడాది కాలం పాటు మాస్టర్స్ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో అడ్మీషన్స్ పొందిన వారు మాత్రమే ఈ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను వెబ్ పోర్టల్ (http://www.andhrabrahmin.ap.gov.in/) లో చూసి అర్హులు అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి సర్కారు బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై బ్రాహ్మణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఒడుగు సమయంలో పేద బ్రాహ్మణులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అని తెలిపారు. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది బ్రాహ్మణ కార్పొరేషన్.