భారత్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. దేశంలో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తుంది. నిన్న,మొన్నటివరకు విదేశాల నుంచి వచ్చినవాళ్లలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడగా.. గడిచిన ఒకటి,రెండు రోజుల్లో లోకల్ కాంటాక్ట్ కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈశాన్య ఢిల్లీలో మొహల్లా క్లినిక్లో పని చేస్తున్న వైద్యుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మార్చి 12-18 తేదీల మధ్య మౌజ్పూర్ క్లినిక్కు వెళ్లిన పేషెంట్లు, ఇతరులను క్వారంటైన్లోకి వెళ్లాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ డాక్టర్ ద్వారా సుమారు 900 మందికి కరోనా మహమ్మారి సోకింది. పరీక్షల్లో వీరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. వీరందరినీ 14 రోజులపాటు ఐసొలేషన్ కి పంపినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి ఎస్.జైన్ వెల్లడించారు.
కోవిడ్ బారిన పడ్డ ఆ డాక్టర్ను 15 రోజుల క్రితం మొహల్లా క్లినిక్లో ఓ మహిళ వెళ్లి కలిసిందని, ఆమె ద్వారానే ఆయనకు వ్యాధి సంక్రమించిందని సమాచారం. అనారోగ్యం బారిన పడిన ఆ డాక్టర్ ముందుగా జీటీబీ హాస్పిటల్లో చేరగా.. అనంతరం సఫ్దర్జంగ్ హాస్పిటల్కు తరలించారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిచామని.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక ఐసోలేషన్ రూమ్కి తరలించామని ఆయన కొలీగ్ అయిన డాక్టర్ హరీష్ గుప్తా తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో డాక్టర్ భార్య, కూతురుకు కూడా పాజిటివ్గా తేలారని ఆయన చెప్పారు. మరోసారి పరీక్షలకు పంపించామన్నారు. ఢిల్లీలో 35 మందికి కరోనా సోకగా.. వీరిలో ఐదుగురికి కరోనా సోకడానికి డాక్టర్ను కలిసిన మహిళే కారణమని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలోని చాలాచోట్ల ప్రాథమిక చికిత్స కేంద్రాలుగా మొహల్లా క్లినిక్ సెంటర్స్ను నిర్వహిస్తోంది. పేద,మధ్యతరగతి వర్గాలే ఈ సెంటర్స్కు ఎక్కువగా వస్తుంటారు. అలాంటిచోట వైద్యుడికే పాజిటివ్ కేసు నమోదవడంతో.. మౌజ్పూర్లో అది ఇంకా వ్యాప్తి చెందనుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

వైద్యుడికి కరోనా పాజిటివ్గా తేలిన నేపథ్యంలో కొంతమంది ఇంటి యజమానులు వైద్యులను ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా బెదిరిస్తున్నారు. దీనిని ముఖ్యమంత్రి కేజ్రివాల్ తప్పు పట్టారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతటి సంక్షోభ సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలను విస్మరించి.. వారిని ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా బెదిరించడాన్ని ఎంతమాత్రం సహించరాదని నెటిజెన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. వైద్యులు తమకెందుకులే అని వదిలేస్తే భారత్ పరిస్థితిని ఊహించుకోవడం దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అటు ప్రధాని మోదీ,ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఇలాంటి తరుణంలో డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉందని గుర్తుచేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా స్వార్థపూరితంగా వ్యవహరించి.. వారిని ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. దీనికి ఆదిలోనే చెక్ పెట్టకపోతే వైద్యులందరిపై తీవ్ర ప్రభావం చూపించి అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.