ఆంజనేయుడు చిరంజీవి అని, ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో 1998లో హనుమంతుడి ఫొటో ఒక్కటి ఇండియాలో వైరల్గా చక్కర్లు కొట్టింది. అందులో ఉన్నది నిజమైన హనుమంతుడనే ప్రచారం జరిగింది. చేతిలో పుస్తకం పెట్టుకుని కుర్చొని.. ఎంతో శాతంగా కనిపించే ఈ రియల్ హనుమంతుడి ఫొటో వెనుక పెద్ద మిస్టరీనే దాగి ఉంది. హిమలయాల్లో చనిపోయిన ఓ వ్యక్తి కెమేరాలో ఈ ఫొటో దొరికింది. ఆ కెమేరాలో ఉన్న రీల్ ను కడగగా ఈ ఫొటో బయటపడింది. దీన్ని బయటపెట్టిన ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు. అసలు ఈ ఫొటో అతడి కెమెరా రీల్ లోకి ఎలా వచ్చింది? ఆ ముగ్గురు ఎలా చనిపోయారు? అది నిజంగా హనుమంతుడి చిత్రమేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉన్నాయి. అయితే, 21 ఏళ్ల తర్వాత వీటికో సమాధానం దొరికింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1998 సంవత్సరంలో హనుమంతుడి రియల్ ఫొటోలు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. చాలామంది ఆ ఫొటోలను ఫ్రేమ్ కట్టించుకుని తమ మండపాల్లో పెట్టుకున్నారు. 2018లో కొంతమంది టీవీ చానెల్ రిపోర్టర్లు బెంగళూరులో ఒక ఎంక్వైరీ చేశారు. ఈ హనుమంతుడి ఫొటో వెనుక ఉన్న ఒకరి ఆచూకీ తెలుసుకున్నారు. బెంగళూరుకు చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం కుటుంబం అందించిన సమాచారం ప్రకారం.. సుబ్రహ్మణ్యం ఒక కెమెరా నుంచి తీసిన రీల్ను డెవలెప్ చేయమని 1998లో బెంగళూరులో ఉన్న కావేరీ కలర్ ల్యాబ్ లోని ఫణీ అనే వ్యక్తికి అప్పగించారు. ఆయన ఆ ఫిల్మ్ను డార్క్ రూమ్ లో నెగటివ్ ను ఫొటో పేపర్ మీద ప్రొజెక్ట్ చేయగా, ఈ ఫొటో బయటపడింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ ఫన్నీ సుబ్రహ్మణ్యంకు సమాచారం ఇచ్చారు. ఆ ఫొటోను చూసి సుబ్రహ్మణ్యం కూడా షాకయ్యారు. నిజానికి ఆ ఫొటోను తీసిన కెమెరా సుబ్రహ్మణ్యానిది కాదు. అతని ఫ్రెండ్ సూర్యనారాయణ శాస్త్రిది.
1998లో ఇద్దరు కలిసి హిమాలయాల్లోని మానస సరోవరంలోని కైలాశ పర్వతానికి ట్రెక్కింగ్ కు వెళ్లారు. ఆయన తన టీమ్ నుంచి విడిపోయి.. అక్కడ వెలుగులు చిమ్ముతున్న ఓ గుహ వైపు ఒంటరిగా వెళ్లారని, ఆ వెలుతురుకు ఫొటో తీయగానే అతను చనిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. సూర్యానారాయణ శాస్త్రీ ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆయన కోసం గాలింపులు జరిపారు. రెస్క్యూ టీమ్ కు సూర్యనారాయణ శవమై కనిపించారు. అధికారులు భౌతిక కాయంతోపాటు ఆయన కెమెరాను కుటుంబ సభ్యులకు అందించారు. సూర్యనారాయణ శాస్త్రి ఎలా చనిపోయారో తెలుసుకొనే క్రమంలో ఆ కెమెరా రీల్ ను డెవలప్ చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. దీంతో సుబ్రహ్మణ్యం దాన్ని ఫణికి ఇచ్చి రీల్ డెవలప్ చేయగా ఆ ఫొటో బయటపడింది. అది ఫొటోలో ఉన్నది నిజమైన హనుమంతుడని అంతా విశ్వసించారు.

ఇలా ఈ ఫోటో వెనుక ఇంత కథ జరిగిందని అందరు నమ్మారు. అది ఆ నోటా.. ఈ నోటా పడి ఆ ఫొటోను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. తమకు కూడా కొన్ని ప్రింట్లు కావాలని కోరారు. దీంతో అప్పట్లో వేలాది ప్రింట్లు వేసి అందరికీ పంచారు. సూర్యనారాయణ మూర్తి ఆ గుహలో హనుమంతుడిని చూసి చనిపోయి ఉండవచ్చని భావించారు. అలా ఆ ఫొటో దేశంలోని చాలా ఇళ్లకు చేరింది. ఆలయాల్లో సైతం వీటిని ఫ్రేములుగా పెట్టి విక్రయించారు. అయితే, ఆ ఫొటో వెనుక ఉన్న మిస్టరీ ఇటీవల బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ హనుమంతుడి ఫొటోలను డెవలప్ చేసిన ఫన్నీ, సుబ్రహ్మణ్యం కూడా కొద్ది రోజుల తర్వాత చనిపోయారు. ఆ రోజు సూర్యనారాయణ శాస్త్రి చనిపోవడాన్ని ఎవరూ చూడలేదు. పైగా ఆయన గుహ వద్ద చనిపోయారనే ప్రచారం జరిగింది. కానీ, ఫొటోను పరిశీలనగా చూస్తే.. అది గుహలో తీసిన చిత్రంలా లేదు. పైగా హనుమంతుడు వెనుక బ్యాక్ గ్రౌండ్, ఆయన కూర్చున్న గట్టుకు టైల్స్ ఉన్నాయి. ఆయన చేతిలో బైండింగ్ పుస్తకం ఉంది. అందులో హనుమంతుడు తులసీదాస్ రాసిన రామచరిత మానస్ చదువుతున్నట్లుగా ఉంది. హనుమంతుడి ఆ బైండింగ్ పుస్తకం ఎలా లభించింది? గుహలో ఆధునిక టైల్స్ ఉంటాయా? పైగా, హనుమంతుడు నిత్యం రామనామ జపం చేస్తుంటారు. ఆయన సర్వజ్ఞాని. పుస్తకం చూసి చదివాల్సిన అవసరం ఆయనకు లేదు. ఈ నేపథ్యంలో ఆ ఫొటోలో ఉన్నది నిజంగా హనుమంతుడి చిత్రమేనా? సూర్యనారాయణ శాస్త్రి ఆ చిత్రాన్ని ఎక్కడ తీశారానే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ప్రముఖ యూట్యూబర్ చేసిన అన్వేషణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆ ఫొటోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో ఇంట్లోనో, గుడిలోనో తీసి ఉంటారనే అనుమానం తప్పకుండా కలుగుతుంది. చివరికి అదే నిజమైంది. ఆ ఫొటోను ఆయన హనుమంతుడి దేవాలయంలో తీశారు. సూర్యనారాయణ ఉత్తర ప్రదేశ్లోని బరెల్లీ జిల్లాలోని పురాణా తాల్ మందిరంలోని హనుమంతుడి విగ్రహం ఫొటో అది. అంటే మీరు ఇప్పటివరకు చూసిన హనుమంతుడి చిత్రాలు నిజమైనవి కావు. అవి హనుమంతుడి విగ్రహానివి. ఇది చాలా పురాతనమైన ఆలయం కావడంతో ఆ చిత్రాన్ని చూసే ఆ విగ్రహాన్ని రూపొందించారని వాదించడం కూడా కష్టమే. అయితే, సూర్యనారాయణ ఆ ఫొటోను 1998లోనే తీశారు. కానీ, అది నేరుగా తీసిన చిత్రం కాదు.. 1995లోని ఓ క్యాలెండర్లోని చిత్రం. అంటే, ఆయన ఆ క్యాలెండర్ లోని ఫొటోను ఫొటో తీసినట్లు తెలుస్తోంది.
మానస సరోవరానికి వెళ్లాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని .అక్కడికి వెళ్లే మార్గంలో అనారోగ్యానికి గురై చనిపోయినవాళ్లు ఎందరో ఉన్నారు. మానస సరోవరంకు వెళ్లిన సూర్యనారాయణ శాస్త్రీ కేవలం అనారోగ్యం వల్లే చనిపోయి ఉంటారని భావించారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే సూర్యనారాయణ మూర్తికి ఎలాంటి వెలుతురు కనిపించలేదని, ఆ ఫొటో నిజమైన హనుమంతుడిది కాదని తేలినట్లే. అలాగే సూర్యనారాయణ శాస్త్రీ, సుభ్రహ్మణ్యం, ఫణీల మరణానికి కూడా ఆ ఫొటో కారణం కాదని స్పష్టమవుతుంది.