తిరుమల గిరులలో స్వామి పేరు నిత్యం మార్మోగుతూ ఉంటుంది
ఆ ఏడు కొండల స్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు
ఆయన కొండపైకి వచ్చిన భక్తులని అన్నీ సదుపాయాలు ఉంటాయి
వందల ఏళ్లక్రితం నుంచి గోవిందుడి దివ్యమంగళ స్వరూపాన్ని కోట్లాదిమంది దర్శించుకుని పునీతులవుతున్నారు
కాని ఇప్పుడు కరోనా వైరస్ ఆదేవ దేవుడ్ని కూడా వదలడం లేదు
వెంకన్న కొండపై రాకపోకలు ఆపేశారు
వైరస్ వల్ల స్వామి దర్శన భాగ్యం భక్తులకి కొద్ది రోజులు నిలిపివేశారు
మరి ఆ కలియుగ వెంకన్న దేవాలయానికి
ఈ సప్తగిరుల్లో ఇలాంటి పరిస్దితి ఎప్పుడైనా వచ్చిందా
ఇలా తిరుమల దేవాలయం గతంలో ఎప్పుడైనా మూసివేశారా అనేది ఇప్పుడు చూద్దాం.
కరోనా విజృంభణ నేపథ్యంలో శుక్రవారం నుంచి వారం రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నారు. తిరుమలకు వచ్చిన భక్తుల్లో ఓ వృద్ధుడు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరడం కలకలం రేపింది. దీంతో ప్రభుత్వ అనుమతులతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతిని రద్దుచేసి, సన్నిధిలో కైంకర్యాలు, సేవలను ఏకాంతంగా కొనసాగించనున్నారు. భక్తులకు అన్నిరకాల దర్శనాలు రద్దుచేస్తూ, ఘాట్రోడ్లును గురువారం మధ్యాహ్నమే మూసివేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి దాదాపు 128 ఏళ్ల తర్వాత భక్తులు కొద్దిరోజుల పాటు దూరం కానున్నారు.

క్రీ.పూ.1వ శతాబ్దంలో తిరుమల కొండపై చీమలపుట్టతో కప్పబడిన స్వామి విగ్రహాన్ని ముందుగా తొండమాన్ చక్రవర్తి దర్శించి ఆ విగ్రహం చుట్టూ చిన్నమండపాన్ని కట్టించారట. అప్పటివరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న మూలమూర్తికి మండపం ఏర్పాటు చేసిన తర్వాత శ్రీనివాసుడు భక్తుల పూజలు అందుకోవటం ప్రారంభమైంది. ఆ తర్వాత పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు, ఆర్కాటు నవాబులు, మహంతులు స్వామిని ఆరాధించి సేవలందించారు. క్రమేపీ శ్రీవారి వైభవం విశ్వవ్యాప్తి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు దర్శనం నిమిత్తం తిరుమలకు రావడం సంప్రదాయంగా మారింది.
ఎంతోమంది తిరుమల క్షేత్రాన్ని పాలించినప్పటికీ సాయంత్రమైతే దట్టమైన అడవిలో ఉన్న ఆలయం మూగబోవాల్సి వచ్చేది. అప్పట్లో అర్చకులు ఉదయాన్నే కొండెక్కి ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసి నైవేద్యం సమర్పించేవారు. మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనం కల్పించి చీకటి పడేలోపు తిరిగి వెళ్లిపోయేవారట. ఎన్ని ఇబ్బందులున్నా స్వామికి కైంకర్యాలు, భక్తులకు దర్శనం నిలిపినట్టు చరిత్రలో ఎక్కడా లేదు.
1892లో మాత్రం జీయర్లు, మహంతులకు మధ్య వివాదం కారణంగా రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు. ఆ సందర్భంలో స్వామి కనీస నైవేద్యాలు, పూజలకు కూడా నోచుకోలేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఆలయం చుట్టూ నివాసాలు ఏర్పాటు చేయాలని 1910లో అప్పటి మహంతులు వివిధ ప్రాంతాల నుంచి జనాల్ని రప్పించి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వ్యాపారాలు, ఇళ్ల కోసం భూములు లీజుకి ఇచ్చారు. దాంతో తిరుమల పట్టణంగా మారడంతో రాత్రిపూట బసచేసే భక్తుల సంఖ్య కూడా పెరింది. ప్రస్తుతం చంద్ర, సూర్యగ్రహణ సందర్భాల్లో మాత్రమే తాత్కాలికంగా కొన్ని గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నారు. అలాగే 1975-80 వరకు మాడవీధుల వెంబడి ఉన్న ఇళ్లలో ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకెళ్లే సందర్భాల్లో మాత్రమే ఆలయాన్ని కొన్ని గంటలు మూసివేసి, దర్శనాన్ని రద్దు చేసేవారు.
1958 నుంచి 1970, 1982, 1994, 2006 అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు సమయంలో కూడా భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నా, దర్శనం రద్దులాంటి నిర్ణయాలు తీసుకోలేదు. 2018 ఆగస్టులో మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాన్ని రద్దు చేయాలని ముందు నిర్ణయం తీసుకున్నప్పటికీ భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పరిమిత సంఖ్యలో దర్శనానికి అనుమతించారు. కరోనా నేపథ్యంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో వారంరోజుల పాటు శ్రీవారికి భక్తులు దూరం కానున్నారు. తిరుమల చరిత్రలో ఆలయం తెరిచి ఉన్నప్పటికీ దర్శనానికి దూరం కావడం ఇదే మొదటిసారి.