ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 11 లక్షలు దాటింది. గత మూడు రోజుల నుంచి దేశవ్యాప్తంగావేల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భారత్ లో 2902 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు మందు కనిపెట్టటానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. చైనా ఇప్పటికే కరోనాకు మందు కనిపెట్టి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. మరోవైపు కరోనాకు వాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ కు చెందిన బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ ప్రకటన చేసింది. లక్కీ స్ట్రైక్, బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్ లను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థ పొగాకు మొక్కల నుంచి కరోనాకు మందు కనిపెట్టినట్లు తెలిపింది. తమ కంపెనీ అనుబంధ సంస్థ అయిన కెంటకీ బయో ప్రాసెసింగ్ పొగాకు మొక్కలతో పలు ప్రయోగాలు చేసి కరోనాకు మందు కనిపెట్టడంలో సక్సెస్ అయిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ప్రస్తుతం కరోనా వాక్సిన్ ను జంతువులపై ప్రయోగిస్తున్నామని… అతి త్వరలోనే ప్రభుత్వం అనుమతిస్తే మనుషులపై కూడా ప్రయోగిస్తామని తెలిపారు. తమకు ఈ విషయంలో ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని కంపెనీ పేర్కొంది. ప్రభుత్వం అనుమతిస్తే జూన్ నెల నుంచి ఈ వాక్సిన్ ను ఉత్పత్తి చేయవచ్చని పేర్కొంది. వారానికి 30 లక్షల డోసుల వాక్సిన్ ను ఉత్పత్తి చేయగలమని కంపెనీ ప్రకటన చేసింది. నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం బీఏటీ లాంటి కంపెనీలతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదు. కంపెనీ యాజమాన్యం మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థతో తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తమ కంపెనీ అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ ను, బ్రిటన్కు చెందిన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్’ను సంప్రదించినట్లు ప్రకటన చేసింది.
ఇక కరోనాకు వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో భారత్ కూడా ఉంది. కొవిడ్-19కి టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ‘కరోఫ్లూ’ అనే పేరుతో ఈ వ్యాక్సిన్ను ఆవిష్కరించే ప్రక్రియలో తనతో పాటు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్- మాడిసన్ శాస్త్రవేత్తలు, టీకా కంపెనీ అయిన ఫ్లూజెన్ పాలు పంచుకుంటున్నట్లు, ఈ మేరకు ఒక ‘అంతర్జాతీయ భాగస్వామ్యం’ కుదిరినట్లు శుక్రవారం ఇక్కడ తెలియజేసింది. ముక్కు ద్వారా ఇచ్చేలా ‘ఇంట్రా నాసల్’ వ్యాక్సిన్గా దీన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఫ్లూజెన్’ కు చెందిన ‘ఎం2 ఎస్ఆర్’ అనే ప్రయోగాత్మక ఫ్లూ టీకా ఆధారంగా కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కసరత్తు చేస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్- మాడిసన్ శాస్త్రవేత్తలు, ఫ్లూజెన్ సహ వ్యవస్థాపకులైన యోషిహరో కవోక, గాబ్రియేట్ నూమాన్ ‘ఎం2 ఎస్ఆర్’ సృష్టికర్తలు. ఈ టీకాకు ఫ్లూ వ్యాధి రాకుండా ఎదుర్కొనే శక్తి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19కు కారణమవుతున్న నావెల్ కరోనా వైరస్ను, ‘ఎం2 ఎస్ఆర్’ లోకి ప్రవేశపెట్టి దాన్ని కరోనా వైరస్ వ్యాధిని అదుపు చేసే వ్యాక్సిన్గా తయారు చేయబోతున్నారు.