అమెరికా వెళ్లేందుకు వీసా స్టాంపింగ్ కోసం నగరానికి వచ్చారు..డబ్బు ఖర్చయినా ఫర్లేదనుకుని కాస్త ఖరీదైన హోటల్లోనే దిగారు.తాజాగా, నాణ్యంగా ఉంటుందనుకుని అదే హోటల్లోని భోజనం తెప్పించుకుని తిన్నారు. అదే ఆ కుటుంబాన్నంతటినీ ఆసుపత్రి పాల్జేసింది. రెండేళ్ల వారి కుమారుడి ప్రాణం తీసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన అందరిని కలిచివేసింది.అమెరికా వీసా కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. బేగంపేట్లోని ప్రముఖ హోటల్లో వడ్డించిన కలుషిత ఆహారం తిని రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా.. దంపతులతో పాటు మరో కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ముఠాపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏటుకూరి రవినారాయణ కుటుంబం బెంగళూరులో నివాసముంటోంది. రవినారాయణకు అమెరికాలో జాబ్ వచ్చింది. కంపెనీ తరపున అమెరికాకు వెళ్లాల్సి ఉండగా.. వీసా స్టాంపింగ్ కోసం భార్యా, పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు.

బేగంపేట్లోని మానస సరోవర్ హోటల్లో బస చేసిన వీరు.. పనీర్ కర్రీతో రోటీని ఆర్డర్ చేశారు. తిన్న కాసేపటికి కడుపునొప్పితో వాంతుల బారినపడ్డారు. తోటి మిత్రులు గమనించి రవినారాయణతో పాటు.. అతని భార్య శ్రీవిద్య, ఇద్దరు పిల్లల్ని బేగంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండేళ్ల కుమారుడు విహాన్ మృతి చెందాడు. ఏడేళ్ల కుమారుడు వరుణ్తో పాటు.. దంపతులిద్దరూ అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. హోటల్ సిబ్బంది మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరించారని.. చికిత్స కోసం కనీసం ఆసుపత్రికి పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
బాధ్యులైన హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి.. కారకులైన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కలుషిత ఆహారం తిని ప్రాణాలు కోల్పోయిన రెండేళ్ల బాలుడు విహాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు. బాలుడి మృతికి కారణాలేంటనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని పోలీసులు చెప్పారు. చూశారుగా బయట ఫుడ్ తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ప్రమాదం బారిన పడి పాపం ఆ చిన్నారి ఈ లోకాన్నే విడిచివెళ్లాడు.
ఈ క్రింద వీడియో చూడండి