దేశంలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఇంత వరకూ లేని విధంగా కేవలం శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 601 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 2,902కు బాధితుల సంఖ్య చేరింది. మృతుల సంఖ్య కూడా 68కి చేరగా 24 గంటల్లో 12 మంది ప్రాణాలను వదిలారు. 2,650 మందికి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా,183 మంది కోలుకున్నారు. వైరస్ లక్షణాలు మన దేశంలో కనిపించినప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్కు వెళ్లి వచ్చిన కారణంగా ఈ కేసుల సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. వేలాది మంది దేశంలోని చాలా ప్రాంతాలకు చేరడంతో అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ ఘటన తర్వాత ఎవరికీ కరోనా ఉందొ తెలియని పరిస్థితి నెలకొంది. అతనికి కరోనా అని తేలిందా? అతన్ని ఎంతమంది కలిశారు? కొంపదీసి మనకు కూడా కరోనా సోకిందా? ఇదీ ప్రస్తుతం ప్రజల పరిస్థితి. ఇది ఇలా ఉంటె ఓ ఊరిలో కరోనా మహమ్మారి మరింత భయాన్ని పెంచింది.

గుజరాత్ లోని సూరత్ సిటీలో ఓ లాండ్రీ షాప్ ఓనర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతని కష్టమర్లలో ఒక్కసారిగా గుబులురేగింది. బట్టల ఇస్త్రీ కోసం కరోనా బాధితుడి దుకాణానికి నగరవ్యాప్తంగా పెద్ద మొత్తంలో కస్టమర్లు వెళ్తుంటారు. అతడిని నిత్యం ఎంతోమంది కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. లాండ్రీ షాప్కు ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని ర్యాండర్ జోన్గా ప్రకటించారు. వీధులన్నింటినీ మూసివేస్తూ బారికేడ్లను ఏర్పాటుచేశారు. మరోవైపు ఏకంగా 54 వేల మంది స్థానికులను క్వారంటైన్లో ఉంచారు. 55 మెడికల్ టీమ్స్తో ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాండర్ జోన్లో ఉన్న 12 ఆసుపత్రులు, 23 మసీదులు, 22 ప్రధాన రహదారులు, 52 ఇంటర్నల్ రోడ్లును శానిటైజ్ చేశారు.
ఇదిలావుండగా లాండ్రీ షాప్ యజమాని(67)ని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందుజాగ్రత్తగా బాధితుడి భార్య, మేనల్లుడు, బావమరిది, అతడి షాపులో పనిచేసే వ్యక్తికి కూడా క్వారంటైన్ సెంటర్కు తరలించి పరీక్షలు చేస్తున్నారు. అలాగే అతడి లాండ్రీ షాపుకు వచ్చే కస్టమర్ల వివరాలను సేకరించారు. వాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ‘ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. వైద్య సిబ్బందికి సహకరించాలి’ అని సూరత్ మున్సిపల్ కార్పొరేసన్ అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా నగరవాసులకు టముకు వేసి చెబుతున్నారు. కాగా, గుజరాత్లో ఇప్పటి వరకు 95 మందికి కరోనా వైరస్ సోకగా.. ఎనిమిది మంది మృతిచెందారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది..